
మాటలు చెప్పడమే తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు ఎక్కడ
తలుపుల మండలం సంగం బజార్ గ్రామంలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కుతవేట దూరంలో ఉన్న సంఘం బజార్ వీధిలో నీటి సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.నీరు అందక వంట పనులు, ఇంటి పనులు చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు వాపోతున్నారు.తాగునీటి కోసం కూడా అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
తమ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించకపోవడంతో మహిళలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలతో మాట్లాడి ఆందోళన విరమించాలని కోరారు. అయితే నీటి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదు అంటూ మహిళలు స్పష్టం చేశారు. కాగ మండల పరిషత్ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అధికారులు స్పందించేది ఎప్పుడు
ప్రజలకు కనీస అవసరమైన తాగునీటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, సంగం బజార్ మహిళలు నీటి కోసం రోడ్డెక్కే పరిస్థితి రావడం అధికారుల పనితీరుపై ప్రశ్నలు తలెత్తేలా చేస్తోంది. సమస్య తీవ్రత తెలిసినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేకపోయారనే ప్రశ్నలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి.నీటి సమస్యను పరిష్కరిస్తామని అధికారులు, రాజకీయ నాయకులు మాటలు చెబుతున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. నీరు లేకుండా వంట ఎలా చేసుకోవాలి ఇంటి పనులు ఎలా చేసుకోవాలి ఇలా అయితే మేము ఎలా బతకాలి అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హామీలు కాదు శాశ్వత పరిష్కారం కావాలిఇక మాటలతో కాలయాపన చేయకుండా సంగం బజార్ వీధిలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్వయంగా గ్రామానికి వచ్చి పరిస్థితిని పరిశీలించి, తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించడంతో పాటు భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.








